కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిర్ధారిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బిఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. అది కాలేశ్వరం కమిషన్ నివేదిక కాదని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా ప్రజల్లో అపోహలు తలెత్తే ఆస్కారం ఉందని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం, దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. మంగళవారం నాడు సాగునీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, దానివల్ల ఉపయోగంపై ప్రజలకు సోదారణంగా వివరించేందుకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అన్ని జిల్లా కేంద్రాలలో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులు వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత జిల్లా నాయకత్వం కాలేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల రాష్ట్ర రైతాంగానికి కలిగిన లాభాలను వివరిస్తూ పత్రిక, మీడియా ప్రతినిధులతో మాట్లాడాలని సూచించింది. గ్రామ, గ్రామాన కాలేశ్వరం పథకంపై ప్రజల్లో చర్చ పెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వివరించాలంటూ పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలను పంపింది.
About The Author
