పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
అక్రమ వెంచర్పై అధికారుల కొరడా!
చింతపల్లి (పెన్ కౌంటర్):-
నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే ఊపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. చింతపల్లి మండల కేంద్ర సమీపంలో వెలసిన ఓ అక్రమ వెంచర్పై 'పెన్ కౌంటర్' దినపత్రికలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ అధికారులు, బుధవారం సదరు వెంచర్ వద్దకు చేరుకుని ప్లాట్ రాళ్లను తొలగించారు.
ఇక వివరాలలోకి వెళ్తే...
గడియ గౌరారం గ్రామ పరిధిలోని, సర్వే నంబర్లు 24, 25లలో సుమారు 8 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో, ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే, వెంచర్ ఏర్పాటు చేసినట్లు 'పెన్ కౌంటర్' వెలుగులోకి తెచ్చింది. చింతపల్లిలో నిబంధనలకు పాతర.. అనుమతులు లేని అక్రమ వెంచర్ కలకలం" అనే శీర్షికతో వచ్చిన, వార్తకు స్పందించిన పంచాయతీ సెక్రటరీ సురేష్, స్థానిక సర్పంచ్ తో కలిసి వెంచర్ స్థలాన్ని పరిశీలించారు.
అనుమతులు లేకుండా భూమిని ప్లాట్లుగా మార్చిన నిర్వాహకుడికి, అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంచర్ సరిహద్దులుగా పాతిన ప్లాట్ కడీలను, అధికారులు దగ్గరుండి తొలగించారు. నిబంధనలు అతిక్రమించి పనులు కొనసాగిస్తే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే పనులు నిలిపివేయడమే కాకుండా, చర్యలు తప్పవని పంచాయతీ సెక్రటరీ సురేష్ అన్నారు. ఈ వెంచర్ వ్యవహారంలో మరో కీలక అంశం చర్చనీయాంశంగా మారింది. సదరు ప్రైవేట్ భూమికి ఆనుకొని ఉన్న, ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసే ఉద్దేశంతోనే..?ఈ వెంచర్ను ఏర్పాటు చేసి ఉండవచ్చు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంచర్ ముసుగులో విలువైన ప్రభుత్వ భూమిని, అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు కూడా, సమగ్ర విచారణ జరిపి భూమిని సర్వే చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
పెన్ కౌంటర్ పత్రిక సామాజిక బాధ్యతతో రాసిన కథనంపై, అధికారులు తక్షణమే స్పందించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
